జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే కావడం విశేషం. బుధవారం శ్రీనగర్లో ఆయన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు.
ఈ సమావేశం అనంతరం సెర్గియో గోర్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్లో ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఇది ఎంతో రమణీయమైన ప్రదేశం” అని కొనియాడారు. కశ్మీర్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో, అమెరికా పౌరుల కోసం జారీ చేసిన ప్రయాణ హెచ్చరికలను (ట్రావెల్ అడ్వైజరీ) సడలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పలువురు అమెరికన్లు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా రాయబారి సెర్గియో గోర్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఆయన లద్దాఖ్లో పర్యటించనున్నారు. కాగా, కశ్మీర్ సమస్యలు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంతర్గత విషయాలని, ఇందులో వాషింగ్టన్ జోక్యం అవసరం లేదని, అందుకే అమెరికా రాయబారితో ఈ అంశాలను ప్రస్తావించబోనని ఒమర్ అబ్దుల్లా ఈ పర్యటనకు ముందే స్పష్టం చేశారు.

