TELANGANA

మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ..

మజ్లిస్ పార్టీ (AIMIM)కి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తున్నట్లు ఎంఐఎం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రహమత్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఆ పత్రాన్ని శాసనమండలి ఛైర్మన్ కు అందజేయాలని పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ అత్తాపూర్ లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా మీర్జా పట్టుబడ్డారని ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ ఆరోపించారు. కొందరు కొట్టి ఆయన్ను వీడియోలు తీశారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన దృశ్యాలు సైతం గత రెండ్రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే సౌదీ పర్యటనలో ఉన్న మీర్జా రహమత్ బేగ్.. ఈ ఆరోపణలను ఖండించారు. నెట్టింట వైరల్ చేస్తున్న వీడియోలను డీప్ ఫేక్ తో సృష్టించినవని పేర్కొన్నారు.

మరోవైపు తనకు డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్సీ రహమత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్సీకే ఈ స్థాయిలో బెదిరింపులు వస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే.. అనూహ్యంగా ఆయనపై వేటు పడటం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా పార్టీ నుంచి డిస్మిస్ చేయడం తీవ్ర దుమారానికి కారణమైంది. అయితే వేటుకు సంబంధించిన కారణాన్ని మాత్రం ఎంఐఎం స్పష్టం చేయలేదు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలోనే మజ్లిస్ పార్టీ చర్యలకు ఉపక్రమించిందని అందరూ చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మీర్జా రహమత్ బేగ్ గురువారం సౌదీకి వెళ్లగా.. ఆ రోజు సాయంత్రానికే ఆయన అత్యవసరంగా హైదరాబాద్ కు వచ్చారు. మజ్లిస్ పార్టీ ఆదేశాల నేపథ్యంలోనే ఆయన హుటాహుటీనా పర్యటనను ముగించుకొని వచ్చారని సమాచారం. దీనికితోడు రెండ్రోజుల క్రితమే అసదుద్దీన్ ఓవైసీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బహిష్కరణ వేటు పడటం గమనార్హం. మరోవైపు రహమత్ తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనలోనే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.