TELANGANA

కొండా సురేఖ స్థానంలో ఎవరు?.. కేబినెట్‌ విస్తరణపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు..

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపైనే అధిష్ఠానంతో చర్చ జరిగిందని తెలిపారు.

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోకుండా ఆపేందుకు ప్రయత్నించినా.. ఏఐసీసీ ఈ విషయంలో సీరియస్‌గా ఉండటంతో నిర్ణయం జరిగిపోయిందన్నారు.

ఇప్పట్లో విస్తరణ లేనట్లే!
ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణకు సంబంధించి హైకమాండ్‌ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్‌ తెలిపారు. రాష్ట్రంలో మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరించాలనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

తనకు మంత్రి పదవి దక్కుతుందంటూ జరుగుతున్న ప్రచారంపైనా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ఈ వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదని తేల్చిచెప్పారు. దీంతో కొండా సురేఖ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చకు ఇప్పటికైతే స్పష్టత రాలేదు.