AP

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం..!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ అంశంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ తీస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి వంచించారని మండిపడ్డారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని చేపట్టిందని గుర్తుచేశారు. జగన్ పాలనలో ఉపాధ్యాయులను గౌరవించకపోగా, కోవిడ్ సమయంలో వారిని వైన్ షాపుల దగ్గర కాపలా ఉంచి అవమానించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

 

డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని ప్రభుత్వం ఆధారాలతో సహా స్పష్టం చేసినా జగన్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. డీఎస్సీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయారని దుయ్యబట్టారు. స్వయంగా ఉపాధ్యాయులే కర్నూలు, విశాఖపట్నంలలో జగన్ కుట్రలను నిరసిస్తూ కదం తొక్కారని తెలిపారు. ఉపాధ్యాయులపై జగన్‌కు ఎందుకంత కక్షో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం యువతను తప్పుదోవ పట్టించడానికే జగన్ ఆధారాల్లేని విమర్శలు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, త్వరలోనే రాష్ట్రంలో రెండో డీఎస్సీని కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ యువత, ఉపాధ్యాయుల శ్రేయస్సుకే కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.