ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు పూర్తయింది. తొలుత సంక్రాంతికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల ని భావించారు. కానీ, రెవిన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ పైన తాజాగా నిర్ణయానికి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అదే సమయంలో కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త డిజైన్ తో కొత్త కార్డులను వినియోగం లోకి తీసుకు రానుంది. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్ తో జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
క్యూఆర్ కోడ్ తో జారీ
ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి కార్డులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారి నుంచి 70 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులతో కూడా కలిపి 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
కేబినెట్ లో ఆమోదం
దీంతో, రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరుతుంది. క్యూఆర్ కోడ్ తో జారీ చేసే ఈ కార్డులను స్కాన్ చేయటం ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు తెలుస్తాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో కొత్త కార్డుల జారీకి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు.. అదే విధంగా పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రాతిపదిక అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం వచ్చే నెల నుంచి సూపర్ సిక్స్ పెండింగ్ పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీంతో, కొత్త రేషన్ కార్డుల జారీ పైన కేబినెట్ లో తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.