AP

విజయసాయిరెడ్డికి సీబీఐ షాక్..

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ షాకిచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు విజయసాయిరెడ్డి న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌కు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే విజయ సాయి రెడ్డి తరుఫు న్యాయవాదులు ట్రయల్ కోర్ట్ గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఫారెన్ టూర్‎కు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది.

 

మరోవైపు విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.తాను క్రియశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు ఆయనప్రకటించారు.రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.

 

ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉప రాష్ట్రపతి విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.