వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటోన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్..నూతనోత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తోన్నారు.
ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారాయన. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటూ సూచించారు అప్పట్లో.
అదే సమయంలో ఏపీ మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధనంజయ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా, కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఓఎస్డీగా పని చేశారు.
ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32గా ఉన్నారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా వైఎస్ జగన్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలును నిలదీసేలా యాక్షన్ ప్లాన్ను రూపొందించడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత సంపద సృష్టించే చిట్కాలను తన చెవిలో చెప్పాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను అడుగుతున్నాడంటూ గతంలో వైఎస్ జగన్ విమర్శించిన విషయం తెలిసిందే.
ఎన్నికల సమయంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి లేనిపోని అపోహలు, అనుమానాలను సృష్టించిందని, దీనివల్ల కొన్ని వర్గాలు తమకు దూరం అయ్యారని జగన్ భావిస్తోన్నారు. వాళ్లందరిని కూడా మళ్లీ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో జిల్లా అధ్యక్షులు కీలక పాత్ర పోషించాల్సి రావడం, జిల్లా స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం, అవినీతి, దౌర్జన్యం, ఇతర అక్రమాలపై నిరంతరం స్పందించడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.