AP

లిక్కర్ స్కామ్.. కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్..!

ఎట్టకేలకు మద్యం కుంభకోణంపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. రేపో మాపో ఆయన అరెస్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో వాటిపై ఆసక్తికర స్టేట్‌మెంట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి మొదలుపెట్టారు.

 

భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ ఎంపీ వాసుదేవరెడ్డి హైకోర్టులో మూడుసార్లు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2014-19 మధ్యకాలంలో లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు.

 

రాజ్ కసిరెడ్డికి-బేవరేజెస్ కార్యకలాపాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు మాజీ సీఎం. అప్పటి ప్రభుత్వం సలహాదారుల్లో ఆయన కూడా ఒకరన్నారు. కేవలం రెండేళ్లు మాత్రమే ఆయన పని చేశారన్నారు. కూటమికి మేలు జరిగేలా విజయసాయిరెడ్డి వ్యవహారించారని ఆరోపించారు.

 

విజయవాడ టీడీపీ ఎంపీతో రాజ్ కసిరెడ్డి వ్యాపారాలు ఉన్నాయంటూ కేశినేని నాని మాటలనే ప్రస్తావించారు. వారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, పలు కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తామంతా కలిస్తే గూగుల్ టేకేవర్ కు తెలీదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

 

ఎంపీ మిధున్‌రెడ్డికి లిక్కర్ వ్యవహారంలో ఏం సంబంధం అని అన్నారు. లోక్‌సభలో ఆయన ఫ్లోర్ లీడర్ అని చెప్పారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. దానికి సంబందించిన ఫైలుపై వారు సంతకం పెట్టలేదన్నారు.

 

వైసీపీ హయాంలో పని చేసిన వారంతా గొప్ప వ్యక్తులని చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలు, పీఎస్ఆర్ ఆంజనేయలతోపాటు మరికొందరు మచ్చలేని అధికారులంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. వారందర్నీ తీసుకొచ్చి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రస్తుత ప్రభుత్వంలో లాటరీ పేరుతో లిక్కర్ షాపులు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారని తూర్పూరబట్టారు. గతంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను వాటిని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ చూడని బ్రాండ్లు లేవా అంటూ ప్రశ్నించారు.

 

కూటమి ప్రభుత్వం వస్తే ధరలు ఎక్కడ తగ్గిస్తామని చెప్పారని, ఎక్కడ తగ్గించారని అన్నారు. ఎంఆర్ఫీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారని, అది స్కామ్ కాదా అని అన్నారు. 99 రూపాయలకు లిక్కర్ ఇచ్చి, దాని క్వాలిటీని తగ్గించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు.

 

గతంలో అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచారని, ఆనాడు ఖరారైన టెండర్ల విలువ అక్షరాలా రూ.41,170 కోట్లని వివరించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందన్నారు. ఆ టెండర్లను రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.