AP

ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి సంవత్సరం మే 28న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఎన్టీఆర్ రాష్ట్రానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తుచేసుకుంది. ఆయన అసాధారణమైన జీవితం, దూరదృష్టితో కూడిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ప్రభావం చూపాయని కొనియాడింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ప్రజాసేవతో పాటు సినీ, రాజకీయ రంగాల్లోనూ విశేషమైన కృషి చేశారని ఉత్తర్వులలో ప్రస్తావించింది. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతిని రాష్ట్ర ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంగా నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.