AP

ఫ్యాన్ లేదు.. లాక‌ప్‌లో దోమ‌లు కుడుతున్నాయి: కోర్టులో నందిగం సురేశ్ పిటిష‌న్..

తుళ్లూరు పీఎస్ లాకప్‌లో ఫ్యాన్ లేకపోవ‌డంతో దోమ‌లు కుడుతున్నాయ‌ని మంగ‌ళ‌గిరి కోర్టులో నందిగం సురేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. లాక‌ప్‌లో ఫ్యాను, దోమ‌ల మందు వినియోగించుకునేందుకు అనుమతించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై గురువారం మంగ‌ళ‌గిరి కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.

 

తుళ్లూరు సీఐ శ్రీనివాస‌రావు కోర్టుకు హాజ‌రయ్యారు. లాక‌ప్ రూమ్‌లోకి ఫ్యాన్‌, పొగ‌వ‌చ్చే దోమ‌ల మందులు, విద్యుత్ దీపాల‌ను వినియోగించ‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వ‌ని న్యాయ‌స్థానానికి వివ‌రించారు. లాక‌ప్ బ‌య‌ట నుంచి గాలి వ‌చ్చేలా టేబుల్ ఫ్యాన్‌, దోమ‌ల చ‌క్రాలు పెట్టుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది కోర‌గా జ‌డ్జి అనుమ‌తించారు. వాటిని లాక‌ప్ బ‌య‌ట ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

 

ఇక‌, ఉద్దండ‌రాయునిపాలెంలోని బొడ్డురాయి సెంట‌ర్‌కు ఈ నెల 17న తాను వెళ్లాన‌ని, ఘ‌ట‌న స‌మ‌యంలో అక్క‌డే ఉన్నాన‌ని, ఇసుక‌ప‌ల్లి కృష్ణ‌పై దాడిచేయ‌లేద‌ని పోలీసుల విచార‌ణ‌లో నందిగం సురేశ్ తెలిపారు. తాను కొన్న స్థ‌లం చూసుకోవ‌డానికే అక్క‌డికి వెళ్లాన‌ని చెప్పారు. అప్పుడే కృష్ణ తిడుతుంటే త‌న సోద‌రుడు ఎందుకు తిడున్నావ‌ని అడిగార‌ని పోలీసుల‌తో అన్నారు.

 

అయితే, కృష్ణ‌ను ఎందుకు ఇంటికి తీసుకెళ్లార‌ని ప్ర‌శ్నించ‌గా… సారీ చెప్ప‌డానికి అత‌డే త‌మ ఇంటికి వ‌చ్చాడ‌ని నందిగం సురేశ్ అన్నారు. కాగా, ఉద్దండ‌రాయునిపాలెం టీడీపీ కార్య‌క‌ర్త ఇసుక‌ప‌ల్లి కృష్ణ‌పై దాడి కేసులో తుళ్లూరు పోలీసులు గురువారం రెండోరోజు సురేశ్‌ను విచారించారు.