AP

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరగాల్సి ఉన్న కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి దర్యాప్తు సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక కేసులో తమ విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఇదిలాఉంటే… ఈ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో రాజ్ క‌సిరెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మాజీ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, అలాగే పి. కృష్ణ మోహన్ రెడ్డిలు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

 

కాగా, ఇతర నిందితుల రిమాండ్ నివేదికలలో వీరి పేర్లు వెలుగులోకి రావడంతో, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వారికి ఊరట లభించలేదు. హైకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది.