AP

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ .. మూడు ప్రధాన సమస్యలపై వినతి..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు ఆయన ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

 

2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకం 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం వల్ల దేశీయంగా పంట ఉత్పత్తి చేస్తున్న రైతులు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోతారని, ఆ సుంకాన్ని పాత రేటు ప్రకారం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

అలాగే, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ద్వారా సేకరించిన పప్పు దినుసులు, ముఖ్యంగా రెడ్ గ్రామ్ గడువు ఈనెల 15తో ముగియనుందని, రైతుల సౌకర్యం దృష్ట్యా సేకరణ గడువును మరింత పెంచాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించి, సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.