AP

టిడ్కో ఇళ్లు మోక్షం వచ్చినట్టేనా. ? టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన..!

టిడ్కో ఇళ్లు మోక్షం వచ్చినట్టేనా? లబ్దిదారులు పుల్ హ్యాపీనా? ఇంతకీ మంత్రి నారాయణ చేసిన ప్రకటన ఏంటి? లబ్దిదారులకు ఏ విధంగా కలిసివస్తుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది. టిడ్కో ఇళ్ల పథకంపై మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు.

 

టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేసి దీపావళికి అందించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాదు మరికొన్ని కీలక అంశాలు ఉన్నాయి.

 

2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. వాటిలో రూ.5,800 కోట్ల AIIB లోన్ మనీ, రూ.3,000 కోట్లను స్వచ్ఛ భారత్ కోసం ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది. అయితే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవాటా చెల్లించలేదు. దీంతో ఆ నిధులు మధ్యలో ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.

 

కేంద్రం నుంచి మళ్లీ నిధులు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల పేరు మీద బ్యాంకు రుణాలు తీసుకుని, వాటిని చెల్లించలేదన్నారు. ఆ రుణాలు నాన్-పెర్ఫార్మింగ్ యాసెట్స్ గా మారాయని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం 140 కోట్ల రూపాయలను బ్యాంకర్లకు చెల్లించిందని గుర్తు చేశారు.

 

దీంతో టిడ్కో ఇళ్ల పథకం తిరిగి గాడినట్టు తెలిపారు. ఈ చర్యలు లబ్ధిదారులకు ఊరట కలిగినట్టేనని తెలిపారు. త్వరలో ఆయా ఇళ్లను అందజేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏం చేసినా లబ్దిదారులకు ఆ ఇళ్లు చేరడం ముఖ్యమన్నారు. వైసీపీ హయాంలో సగం సగం కట్టిన ఇళ్లు నిర్మాణాలు ఆగిపోయి, తుప్పలు పెరిగిపోయాయని వివరించారు.

 

ఖజానాలో నిధులు లేకపోవడం, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం వంటి అంశాలు అడ్డంకులుగా మారినట్టు తెలిపారు. దీపావళికి లబ్దిదారులు తమ కలల ఇంటిని పొందుతారని వెల్లడించారు. ఇక అమృత్ స్కీమ్ కింద తాగు నీటి పైప్‌లైన్ పనుల కోసం టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

 

ఆ పనులు పూర్తయితే రాష్ట్రంలోని 85 శాతం టిడ్కో ఇళ్లకు కాలువల ద్వారా నేరుగా తాగునీరు అందుతుందన్నారు. ఐదు వేల కోట్ల విలువైన పనుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులపై ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.

 

అలాగే నెల్లూరు, రాజమహేంద్రవరంలో వ్యర్థాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయని చెప్పారు. ఆ ప్లాంట్లు 7,500 టన్నుల వ్యర్థాలను శక్తిగా మార్చగలవని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టిన 85 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల సమస్యను పరిష్కరించడంలో సహాయ పడతాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో పరిశుభ్రత, పట్టణ అభివృద్ధి పనులు మరింత మెరుగుపడతాయన్నారు.