విశాఖపట్నం, విజయవాడ మెట్రో మొదటి దశ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు ముఖ్య నగరాల మెట్రో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో ప్రాజెక్టు, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కన్సల్టెన్సీలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
మంత్రి సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, విశాఖ మెట్రో ఫేజ్ 1లో భాగంగా 46.23 కిలోమీటర్లు పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఫేజ్-2లో మరో 30 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. విజయవాడ మెట్రో రైలుకు మరో రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.