ఆంధ్రప్రదేశ్లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.
చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ చర్య నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఈ వార్తతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రవినాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ మద్దతుతో క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.