దీపావళి పండుగ సందర్భంగా అల్లు కుటుంబం నుంచి వచ్చిన ఒక ఫొటో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఈ ఫొటోలో, అల్లు శిరీష్ తన కాబోయే భార్య నైనికను తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశారు. దీపావళి వేడుకల్లో భాగంగా అల్లు కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేయగా, ఈ సందర్భంగా తీసిన ఫొటోలో శిరీష్, నైనిక జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ కొత్త జంటను చూసి అభిమానులు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ కామెంట్లు పెడుతూ, ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కొన్ని రోజుల క్రితమే అల్లు శిరీష్ తన నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ వద్ద నైనిక చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ, “మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా జీవితంలోని ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటున్నాను. నేను నైనికతో నిశ్చితార్థం జరుపుకున్నాను” అని ఎమోషనల్గా పోస్ట్ చేశారు. పారిస్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం.
తన ప్రేమ, పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వస్తున్న అల్లు శిరీష్, ఈ దీపావళి ఫొటో ద్వారా తన కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నైనిక హైదరాబాద్కు చెందిన అమ్మాయి అని తెలుస్తుండగా, ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

