CINEMA

ఇండిగో విమానాల్లో గందరగోళం: సాంకేతిక సమస్యలపై నటుడు నరేశ్ ఫైర్, ప్రైవసీ కోల్పోతున్నామని ఆవేదన

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో (Indigo) తలెత్తిన సాంకేతిక సమస్యలు మరియు విమానాల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ (Naresh) కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, కానీ అప్పటికే అన్ని విమానాలు ఆలస్యం అయ్యాయని నరేశ్ తెలిపారు. “విమాన ప్రయాణాల్లోని సరదా 90వ దశకంతోనే ముగిసిపోయింది. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతా గజిబిజిగా ఉంది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత విమాన ప్రయాణాల కన్నా 1990ల నాటి ప్రయాణాలే సురక్షితంగా, మెరుగ్గా ఉండేవని నరేశ్ అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ఈ పరిస్థితుల్లో నటులకు ప్రైవసీ (గోప్యత) కూడా లేకుండా పోయిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా కూడా స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయి” అని ఆయన వాపోయారు. “టైమ్ మెషీన్ ఉంటే బాగుండును, 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని” అంటూ ఆయన తన ఇబ్బందిని తెలియజేశారు. విమానయాన సంస్థల్లోని సాంకేతిక లోపాలు, గందరగోళంపై సినీ నటుడు నరేశ్ వ్యక్తం చేసిన అసహనం ఇప్పుడు చర్చనీయాంశమైంది.