National

వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్..

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.

 

ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పిటిషన్‌లో ఆరోపించారు.

 

ఇదిలా ఉండగా, వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు.