దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలనే దాయాది ప్లాన్కు చెక్ పెట్టాయి భారత నిఘా సంస్థలు. ఈసారి వారి ఎత్తులకు పైఎత్తు వేయడంతో దేశ రాజధానిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకోసం మూడు నెలల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాయి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఓ పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్తో పాటు.. అతడికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి పాక్ ఐఎస్ఐ ఏజెంట్
జనవరిలో ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ సమాచారం అందింది. పాకిస్థాన్ నుంచి భారత్కు ఓ ఐఎస్ఐ ఏజెంట్ రాబోతున్నాడు.. అతను ఢిల్లీలో ఉండి ఆర్మీ స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు.. కొన్ని ఫోటోలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకోబోతున్నాడనేది ఆ ఇన్ఫో. విషయం తెలుసుకున్న నిఘా అధికారులు ఏమాత్రం తొందరపడకుండా ప్లాన్డ్గా వ్యవహరించారు. అనుకున్నట్టుగానే ఆ ఏజెంట్ నేపాల్ మీదుగా భారత్కి వచ్చాడు. అతడు ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి మూవ్మెంట్ను అబ్జర్వ్ చేశారు. అతను ఢిల్లీకి వచ్చాడు. కొన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొట్టాడు. ఎప్పుడైతే ఆర్మీకి సంబంధించిన పత్రాలను తీసుకునేందుకు ఓ ప్రాంతానికి వెళ్లాడో.. సరిగ్గా అప్పుడు అతడిని పట్టుకున్నారు.
ఆ డానిష్ గాడు యమ డేంజర్..
తన చేతికందిన డాక్యుమెంట్స్తో నేపాల్ మీదుగా తిరిగి పాకిస్థాన్కు చెక్కేయాలనేది ఆ పాక్ ఏజెంట్ ప్లాన్. కానీ అతడిని స్పాట్లోనే అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్స్ను రికవరీ చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తిని అన్సూరల్ మియా అన్సారీగా గుర్తించారు. అతడికి పాక్ హైకమిషన్ ఉద్యోగులు కూడా సహకరించినట్టు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఉద్యోగులైన ముజామిల్, డానిష్లపై నిఘా సంస్థల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
స్లీపర్ సెల్ స్టూడెంట్
అరెస్ట్ తర్వాత అన్సారీని పోలీసులకు అప్పగించారు అధికారులు. జనవరిలో ఈ కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 15న అన్సారీని అరెస్ట్ చేశారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. అన్సారీకి రాంచీకి చెందిన స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ అయిన అజామ్ అనే స్టూడెంట్ సహకరించినట్టు గుర్తించారు. మార్చ్లో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ నుంచి కీలకమైన డేటాను రికవరీ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్థాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్తో నిత్యం టచ్లో ఉన్నారని తేల్చారు.
పెద్ద ఉగ్ర ముప్పు తప్పింది..
ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కావాల్సిన గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ను సేకరించినట్టు తెలుస్తోంది. భారీ ఉగ్ర దాడులకు కుట్ర జరిగిందని తేల్చారు. ప్రస్తుతం వీరిద్దరిని తీహార్ జైలులోని హైసెక్యూరిటీ వింగ్లో ఉంచారు. ఇతర ఖైదీలతో కలవకుంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.