తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం వెల్లడించారు. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు రాజాసింగ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ బెదిరింపులు తనను భయపెట్టలేవని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు.
ఈ ఘటనకు సంబంధించి రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. అందులో, తనకు వచ్చిన బెదిరింపు కాల్స్కు సంబంధించిన ఒక ఫోన్ సంభాషణ వీడియోను కూడా పంచుకున్నారు. తన కొడుకును కిడ్నాప్ చేసి, హతమారుస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని, ఎవరికీ భయపడనని రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో రాజాసింగ్కు ఇలాంటి బెదిరింపు కాల్స్, సందేశాలు ఎక్కువ కావడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నాడు, భద్రతా కారణాల దృష్ట్యా రాజాసింగ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. భద్రతా సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని నోటీసులు జారీ చేశారు. అలాగే, ఒంటరిగా బయట తిరగవద్దని కూడా ఆయనకు సూచించారు.