బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు పేల్చేయబోతున్నట్లు మెయిల్ వచ్చింది.
మెయిల్లో బెదిరింపు
కామ్రేడ్ పినరయి విజయన్ అనే మెయిల్ ఐడీతో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్వ్కాడ్తో ముమ్మరంగా గాలించారు. దీనితో వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్ సర్వీసుల బృందాలను రంగంలోకి దింపారు. BSE పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ముమ్మర తనిఖీలు
బాంబ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో భవనం అంతటా.. క్లిష్టమైన తనిఖీలు నిర్వహించాయి. మెటల్ డిటెక్టర్లతో పాటు బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ యూనిట్ (BDDS) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గదులు, కేబిన్లు, పార్కింగ్, స్టోరేజ్ ప్రాంతాలను శోధించారు. చివరకు, ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు అక్కడ లభించలేదని.. అధికారులు స్పష్టం చేశారు.
నకిలీ బెదిరింపు కావచ్చునన్న అనుమానం
తదుపరి విచారణలో ఈ బెదిరింపు నకిలీ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మెయిల్లో ఉపయోగించిన ఐడీ “కామ్రేడ్ పినరయి విజయన్” పేరుతో ఉండటం, ఇది కేరళ ముఖ్యమంత్రి పేరుతో పోలిక కలిగించడమే కాక, రాజకీయ అజెండా కలిగి ఉన్నవారు కావచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మెయిల్ టెంప్లేట్, ఐపీ అడ్రస్, మెటా డేటాను ట్రాక్ చేయడానికి సైబర్ క్రైం విభాగం ఇప్పటికే పని ప్రారంభించింది.
కేసు నమోదు – సైబర్ విచారణ వేగంగా కొనసాగుతోంది
ఈ ఘటనపై ముంబై పోలీస్ కమిషనరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీబీఐ, ఎన్ఐఏ వంటి జాతీయ స్థాయి సంస్థల సహకారం.. అవసరమైతే తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
భద్రతా మార్గదర్శకాలు పునర్విమర్శ
ఈ ఘటన నేపథ్యంలో, ముంబై నగరంలోని ఇతర కీలక ఆర్థిక, ప్రభుత్వ భవనాల భద్రతను మరోసారి సమీక్షించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. BSE, NSE, RBI, SBI ప్రధాన కార్యాలయాలు వంటి కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే నకిలీ బెదిరింపుల పరిస్థితులపై.. ముందస్తుగా స్పందించేందుకు ప్రత్యేక డ్రిల్లు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు ఇది నకిలీ బెదిరింపుగా ఉన్నా, ఇందులో ఉన్న ఆంతర్యాన్ని ప్రభుత్వ, భద్రతా యంత్రాంగాలు తేలికగా తీసుకోవడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటన మరోసారి భద్రతా వ్యవస్థల లోపాలను సూచించడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో జరగుతున్న నేరాలకు.. మరింత చురుకుగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.