National

బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ..!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలోని యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడం ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రణాళికలకు పెద్ద ఊపునిచ్చినట్లయింది.

 

చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇది రెండో అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం కంపెనీ సుమారు రూ. 25,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతంలో చైనాకు చెందిన ఇంజినీర్లు వెనక్కి వెళ్లిపోవడంతో ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం తైవాన్ వంటి ఇతర దేశాల నుంచి నిపుణులను రప్పించి ఫాక్స్‌కాన్ కార్యకలాపాలను ముందుకు నడిపిస్తోంది.

 

భారత్‌లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేయగా, 2025 నాటికి దీనిని 6 కోట్ల యూనిట్లకు చేర్చాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత్‌లో తయారైన ఐఫోన్లకు అంతర్జాతీయంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవల యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ, 2025 జూన్‌లో అమెరికాలో విక్రయించిన అత్యధిక ఐఫోన్లు భారత్‌లోనే తయారైనవని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు అసెంబుల్ అయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.