National

యుద్ధం ముగియాలి.. శాంతి నెలకొనాలి: పుతిన్‌తో భేటీలో మోదీ..

ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని మరోసారి ప్రపంచ వేదికపై స్పష్టం చేశారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా సోమవారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 

ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యుక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. ఇందులో భాగస్వాములైన అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం. ఈ ఘర్షణను వీలైనంత త్వరగా ముగించి, ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పే మార్గాలను మనం కనుగొనాలి. ఇది యావత్ మానవాళి పిలుపు” అని స్పష్టం చేశారు.

 

మోదీ వ్యాఖ్యలకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఎస్‌సీఓ సదస్సులో తన ప్రసంగం సందర్భంగా, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారంలో భారత్, చైనా వంటి వ్యూహాత్మక భాగస్వాములు అందిస్తున్న సహకారాన్ని తాము ఎంతగానో గౌరవిస్తున్నామని పుతిన్ పేర్కొన్నారు. గ‌త నెల‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన అవగాహనలు ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం సుగమం చేశాయని ఆయన ప్రస్తావించారు.

 

ఈ భేటీ తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, పుతిన్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. వాణిజ్యం, ఎరువులు, అంతరిక్షం, భద్రత, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించామని వెల్లడించారు. “ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారంతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మేం అభిప్రాయాలు పంచుకున్నాం. మన ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి కీలక స్తంభంగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

 

మరోవైపు, ఎస్‌సీఓ సదస్సు కోసం చైనాకు వచ్చిన వెంటనే శనివారం ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఫోన్ చేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూరప్ నేతలతో వాషింగ్టన్‌లో జరిగిన చర్చల వివరాలను జెలెన్‌స్కీ ప్రధానికి వివరించారు. ఈ సంక్షోభ పరిష్కారానికి అవసరమైన ప్రయత్నాలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఎస్‌సీఓ సదస్సు వేదికగా రష్యాకు సరైన సంకేతాలు పంపుతామని మోదీ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.