భారత అత్యున్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా వెల్లడయ్యాయి. ఈయన నవంబర్ 24, 2025న దేశ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హర్యానా రాష్ట్రం నుంచి ఈ పదవిలోకి రానున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి మరియు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆస్తి విలువ కోట్లల్లో ఉన్నప్పటికీ, ఆయన కుటుంబం ఎటువంటి అప్పులు ప్రకటించకపోవడం గమనార్హం.
జస్టిస్ సూర్యకాంత్ మరియు ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రధాన ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) అధికంగా ఉన్నాయి. ఆయన, ఆయన భార్య మరియు కుమార్తెల పేరు మీద మొత్తంగా రూ.8 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఒక్క జస్టిస్ సూర్యకాంత్ పేరు మీదనే 16 FDలు ఉండగా, వాటి విలువ వడ్డీతో కలిపి సుమారు రూ.4.11 కోట్లుగా అంచనా. స్థిరాస్తుల విషయానికి వస్తే, న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-I, చండీగఢ్ సెక్టార్ 10, సెక్టార్ 18C, గురుగ్రామ్ డీఎల్ఎఫ్-II, సుశాంత్ లోక్-1 వంటి ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలతో పాటు, హర్యానాలోని పంచకులలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.
ఇక విలువైన వస్తువుల విషయానికి వస్తే, జస్టిస్ సూర్యకాంత్ మరియు ఆయన సతీమణి వద్ద కలిపి మొత్తం 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయన భార్య వద్ద సుమారు 6 కిలోల వెండి సామాగ్రి ఉంది. అలాగే, వారిద్దరు కుమార్తెల పేరు మీద సుమారు రూ.59 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు 10 తులాల బంగారం ఉన్నట్లు వెల్లడైంది. జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద సొంత వాహనం లేనప్పటికీ, ఆయన భార్య పేరు మీద మారుతీ సుజుకీ వ్యాగనార్ కారు ఉంది. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు.

