తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ ముఖ్యమంత్రి బృందంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను మరియు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా భేటీ అయ్యారు. పార్టీ అగ్ర నాయకత్వంతో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని ముఖ్య రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి బృందం పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన గెలుపు ఊపుతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళతామని రేవంత్ రెడ్డి బృందం పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే విషయాన్ని కూడా పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం.
పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పార్టీ నాయకత్వాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

