TELANGANA

తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ: షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు.

 

ఇప్పటికే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4,5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ.

 

ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆదిలాబాద్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోడీ పర్యటన ఉండటంతో మార్చి 4వ తేదీన రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది.

 

ప్రధాని మోడీ తెలంగాణ షెడ్యూల్:

 

మార్చి 4న ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదే రోజున ఆదిలాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు ప్రధాని మోడీ. ఇక, మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్నా ప్రధాని మోడీ. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.

 

కాగా, రాష్ట్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్‌ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రజలకు తెలియజేస్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి. 106 సమావేశాలు, 102 రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.