TELANGANA

‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..

గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పారు. ఈ చ‌ట్టంలో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమ‌మే ధ్యేయంగా భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అధికారులు త్వరలో ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని కోరారు.

 

గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే రెవెన్యూశాఖ

 

గత ప్రభుత్వ హయాంలో కొందరి గుప్పిట్లోనే రెవెన్యూశాఖ ఉండిపోయిందని పొంగులేటి ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వం త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని చెప్పారు. రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. గ్రామాల్లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌డానికి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందన్నారు.

 

భూ భారతి బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భూ హక్కుల పరిష్కారంలో ఇదో కీలక మజిలీ అని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తాను భాగస్వామని అయినందుకు సంతోషంగా ఉందన్నారు. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ చట్టం రూపొందిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో చట్టం అమలు జరగాలని.. రైతుల భూమి సమస్యలు తీరాలని ఆకాంక్షించారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.