TELANGANA

ఫార్ములా -ఈ రేస్ కేసు.. ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈనెలాఖరులోగా విచారణ పూర్తి అవుతుందా? ఇటు ఏసీబీకి.. అటు ఈడీకి చిక్కిన, లభించిన ఆధారాలేంటి? ఈ కేసులో ఏసీబీ ముందు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు హాజరవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

ఫార్మాలా ఈ రేసు కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసు ప్రారంభంలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. వీరిని విచారిస్తే ఇక్కడితే కేసు ఆగిపోయినట్టేనని చాలామంది భావించారు. ఇప్పుడు తెరపైకి ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ పేరు వచ్చింది.

 

ఆ కంపెనీ.. ఫార్ములా ఈ- రేసుకు స్పాన్సర్ షిప్‌గా వ్యవహరించింది. ఇప్పుడు నిజాలు నిగ్గు తేల్చేపనిలో పడ్డారు అధికారులు. విచారణకు హాజరుకావాలని ఏస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ- కార్ రేస్ 9వ సీజన్‌కు స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే 10వ సీజన్‌కు తప్పుకుంది ఈ కంపెనీ.

 

10వ సీజన్ ఏస్ నెక్ట్స్ తప్పుకోవడంతో దాని స్థానంలో ఎంటరైంది హెచ్ఎండీఏ. ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్. ఆయనతో-మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎలెక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో. అయితే ఏస్ నెక్ట్స్ జెన్ మాతృ సంస్థ గ్రీన్ కో.

 

విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు చేయడం, ఆపై కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు నోరు విప్పితే ఈ కేసు క్లయిమాక్స్‌కు రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కంపెనీ నిజాలు చెబుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేస్తోంది ఆ కంపెనీ. ఇలాంటి సమయంలో కేసు వ్యవహారం ఆ కంపెనీ మెడకు చుట్టుకుంటే ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశముంది. మరి ఫార్ములా కుంభకోణం ఇక్కడితే ఆగుతుందా? ఏసీబీ తర్వాత ఈడీ కూడా ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు అంతర్గత సమాచారం.