TELANGANA

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్..! బయో ఏషియా-2025 ఈవెంట్‌లో సీఎం రేవంత్..

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు ఎన్నో పని చేస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు.

 

మంగళవారం హైటెక్స్‌లో బయో ఏషియా-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గ దర్శనం చేసేలా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందన్నారు.

 

మొదటి నుంచి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాల నే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తాము ఇంతకాలం ఉన్నత విద్యపై దృష్టి పెట్టామన్నారు. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశామన్నారు. అందుకు తగ్గట్టుగానే జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.

 

సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లో దాదాపు రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామ న్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

 

ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా హైదరాబాద్‌ను నెలకొల్పుతామన్నారు. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు.

 

జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించిందన్నారు. ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. గడిచిన 25 ఏళ్లగా హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్‌ పవర్‌ హౌస్‌గా పేరు నిలుపుకుందన్నారు.

 

హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, AI సిటీతోపాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించిందన్నారు. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సాగుతున్నాయని, 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నామన్నారు.

 

కోర్ సిటీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్‌ను అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ రెండింటిని రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామన్నారు. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రై పోర్టును అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్‌కు అనుసంధానం ఉండేలా రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు.

 

సోమవారం హైదరాబాద్‌లో అమ్జెన్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు సీఎం. ప్రభుత్వం సహకారానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకొచ్చారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉందన్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు.

 

ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని తాము ఆశిస్తున్నామన్నారు. గత ఏడాది ఏఐ హెల్త్‌కేర్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. దేశ విదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖులు తన అభినందనలు తెలిపారు. అందరూ తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నట్లు వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.