కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ని కోరారు.
ఈ ఏడాది హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వంటి వేదికల వివరాలను ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దౌత్య సహకారంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్ విజయవంతం అయ్యేలా సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో నిర్వహించే భారత కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్కు తగినంత ప్రచారం, ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్ అభ్యర్థన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారు.
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న హైదరాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు విదేశీ వ్యవహారాల శాఖ మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర మంత్రి జైశంకర్ తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ వెంట కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు
సరైన విధానాలు లేకుండా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తలపెట్టిన డీలిమిటేషన్ ఎత్తుగడకు వ్యతిరేకంగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.
తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ ఆధ్వర్యంలో ఎంపీలు కనిమొళి, ఎ.రాజా ఇతర నేతలతో కూడిన డీఎంకే ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని ఢిల్లీలో కలిశారు. మార్చి 22న తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
“పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సహా ఇతర రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించడంతో పాటు కేంద్రం కుట్రలను నిలువరించేలా తదుపరి కార్యాచరణ తీసుకోడానికి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ని అభినందిస్తున్నాను. మా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని ఈనెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరువుతాను అని సీఎం చెప్పారు.
దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో ఉన్నప్పటికీ.. కేవలం తమకు రాజకీయంగా పట్టు చిక్కడంలేదనే అక్కసుతో బీజేపీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయాలని భావిస్తోంది. ఈ కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టి, దేశ సమైక్యతను, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటాం. అందుకోసం అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన చెపడతామన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ రాష్ట్రంలోనూ డీలిమిటేషన్ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సారధ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి నివేదిస్తాం. ప్రతిఒక్కరు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.