TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. !

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. తన నియోజకవర్గం సిరిసిల్ల లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కు వెళ్దాం.. ఎక్కడైన వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒక వేళ వంద శాతం రుణమాఫీ జరిగినట్లు ప్రూఫ్ అయితే రాజకీయాలే వదిలేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు.

 

‘ఎంపీ ఎన్నికల్లో మాకు వచ్చింది గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చింది కూడా గుండు సున్నా. ఉద్యోగాలపై అయితే బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు. 25 శాఖల్లో కొత్తగా నియామకాలు చేపట్టాం అంటున్నారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదని బయట చెబుతున్నారు. కానీ రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశామని ఇక్కడ మాట్లాడుతున్నారు. కొత్త టెండర్లకు డబ్బులు ఉన్నాయి కానీ.. ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బు లేదా..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

 

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘సిరిసిల్ల లేదా కొడంగల్ కు వెళ్దాం. ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒకవేళ వంద వాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. ఎన్నికల ముందు రైతుబంధు ఆపంది కాంగ్రెస్ పార్టీ వాళ్లే. ప్రజలు వీళ్లను గోల్డ్ అనుకున్నారు.. కానీ వీళ్లు రోల్డ్ గోల్డ్. అప్పులపై ప్రభుత్వం చెబుతోంది నిజమా..? కాగ్ చెబుతోంది నిజమా..?’ అని కేటీఆర్ నిలదీశారు.

 

‘మా ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన జైలుకు వెళ్లడంలో అసలు తమకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాలకు చెందిన వాళ్ల మీద, ఆడవాళ్ల పై, మైనర్ పిల్లలను అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడలేదా..? అది ఎంత వరకు కరెక్ట్..? ఒక మీ ఇంట్లోనే మహిళలు ఉంటారా..?.. ఇతరుల ఇళ్లలో మహిళలు ఉండరా..? తనకు అప్పట్లో వేరే వాళ్లతో రంకు అంటకట్టారు. అది ఎంత వరకు కరెక్ట్..?’ అని గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన పలు ఆరోపణలను కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

 

డ్రోన్ లను తమ ఇంటి మీద వదిలేశారని.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారని.. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం పదవి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్టేషన్ ఉన్న వ్యక్తిని చూడటం ఇదే తొలిసారి చెప్పారు. సీఎం ఇలా మాట్లాడటమే తమకు కావాలని అన్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పారు.