ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. HCUలోని 400 ఎకరాల్లోనే కాకుండా.. వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్క్కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అది సింగపూర్ లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎకో పార్క్పై కూడా వర్కవుట్ చేయనుందని తెలుస్తోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే.. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలనూ కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి హైదరాబాద్కే తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. హెచ్సీయూకు ఫోర్ట్ సిటీలో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని భావిస్తోందట. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో గచ్చిబౌలి భూముల చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. 400 ఎకరాలను ఇటీవలే సుప్రీం కోర్టు కేసు ద్వారా స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం TGIIC ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక అవసరాల కోసం వాడేందుకు డెవలప్ చేస్తోంది. అయితే ఆ భూమిని టచ్ చేయొద్దు అని HCU స్టూడెంట్స్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇలా అంతా రంగంలోకి దిగే సరికి రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై ఇటీవలే సీఎం రేవంత్ కూడా ఫైర్ అయ్యారు.
అది గ్రీన్ జోన్ అని, నెమళ్ల స్థావరం అని రకరకాల పేర్లు పెట్టి ప్రభుత్వం తీసుకునేందుకు వీల్లేదన్న వాదనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25 లోని 400 ఎకరాల భూమి చుట్టూ వివాదం పెరిగే సరికి TGIIC క్లారిఫికేషన్ ఇచ్చింది. డెవలప్ మెంట్ చేస్తున్న 400 ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములు లేవన్నది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని, అభివృద్ధి పనులతో అక్కడ ఉన్న రాళ్లకు నష్టం లేదని, అంతే కాదు.. 400 ఎకరాల్లో చెరువు కూడా లేదన్నది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024, జులై 19న HCU రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే జరిగిందని, అదే రోజు హద్దులు నిర్ధారించారన్నది TGIIC.
ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదే అంటూ జరుగుతున్న ప్రచారంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2004లోనే HCU ఈ భూములపై యాజమాన్య హక్కులను వదులుకుందని.. మొత్తం 5534 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించిందని తెలిపారు. దీనికి బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలను ప్రభుత్వం యూనివర్సిటీకి బదలాయించిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఈ భూములు తమకు చెందినవే అని వాదిండచం వెనక రాజకీయమేంటన్నది అంతు పట్టని విషయం.
అంతేకాదు అసలు BRS ప్రభుత్వ హయాంలో HCU భూముల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. HCUకు చెందిన భూముల్లో 50 ఎకరాలను మైహోమ్ రామేశ్వర్రావుకు కట్టబెట్టారని, అక్కడ ఆయన మైహోమ్ విహంగ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మించి సొమ్ము చేసుకున్నారని కాంగ్రెస్ అంటోంది. అప్పుడు ఆందోళన చేయని BRS, BJP.. ఇప్పుడు ప్రభుత్వ భూమి విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది.
ఇక గత కొద్దిరోజుల క్రితం HCUపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. భూమిని దోపిడి చేసిన వారే, కాపాడుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం HCU భూముల జోలికి వెళ్లడం లేదని, యూనివర్సిటీకి సంబంధించి అంగుళం భూమిని కూడా తీసుకోవడం లేదని వివరణ ఇచ్చారు. HCUకు సంబంధం లేని భూముల విషయంలో.. యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు మంత్రి.
ఓయూ భూముల్లో BRS డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టేందుకు ప్రయత్నించదని గుర్తు చేశారు శ్రీధర్బాబు. విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆనాడు వెనక్కి తగ్గిందన్నారు. ఈరోజు మాత్రం HCUకు ఎలాంటి సంబంధం లేని భూముల గురించి మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి చూపిస్తోంది. HCU భూములపై గతంలో కేసీఆర్ ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు శ్రీధర్బాబు.