TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వాఖ్యలు..!

బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విర్శంచారు. నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 

ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో గానూ లాభం చేకూరేదని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటిపై, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర నీటి ప్రాజెక్టులపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి ఆలోచించలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత లేకుండా నిర్మించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

మరిన్ని చెక్ డ్యాంలు మంజూరు చేస్తాం..

 

నిజాంసాగర్‌, ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ హయాంలోనేనని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. వీలైనంత త్వరలోనే.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మరిన్ని చెక్‌ డ్యామ్‌లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రైతులకు లాభం చేకూరే విధంగా ఈ సర్కార్ సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రూ.లక్ష కోట్లు అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే.. మూడేళ్లకే కూలిపోయిందని సంచలన విమర్శలు చేశారు.

 

రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ నం.1: మంత్రి తుమ్మల

 

రైతు మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా మాట్లాడారు. పసుపు పంటకు మద్ధతు ధర వస్తేనే.. రైతులు గొప్పగా బతుకుతారని.. తలెత్తుకుని ఉండగలరని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి సరితూగే రాష్ట్రం మరొకటి లేదని చెప్పారు. తెలంగాణకు పసుపురాణి లాంటిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అని వ్యాఖ్యానించారు. రైతులకు రూ.2 లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.

 

1 ఎకరం ఆయిల్ ఫామ్ = 4 ఎకరాల వరిపంట

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రైతుబంధు పథకం అమలు చేసి.. మిగతా అన్ని పథకాలను నిలిపివేసిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. వేసవికాలం అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు వ్యవసాయ యంత్ర పరికరాలను ఇవ్వలేదని చెప్పారు. రేవంత్ సర్కార్ మళ్లీ వాటి పంపిణీని ప్రారంభించిందని అన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. నాలుగు ఎకరాల వరిసాగుతో వచ్చే లాభం ఎకరం ఆయిల్ ఫామ్ తోటతో వస్తుందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సాగు విస్తరణ మరింత పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.