TELANGANA

గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తూ.. 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన రేవంత్ సర్కార్..

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల కావడం, అభివృద్ధికి అద్దం పడుతోంది.

 

ఇకపోతే, ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) కింద చేపట్టిన వివిధ పనుల కోసం రూ.85 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇది గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం ఇవ్వనుంది. గురువారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమంపై చర్చ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో MIM ఎమ్మెల్యేలతో మరో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందులో ఓల్డ్ సిటీ సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ చర్యలన్నీ గ్రామీణాభివృద్ధి, యువత సంక్షేమం, పట్టణ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.