APTELANGANA

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం..!

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.  తిరుపతిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గుణశేఖర్ ఒకరు. మరొకరు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు మూడురోజులుగా గాలింపు చేపట్టాయి. అరెస్టయిన వీరిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వీరిని తీసుకొచ్చారు.

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. అయినా మూడో కంటికి దొరక్కకుండా ఈ వ్యాపారం సీక్రెట్‌గా సాగుతోంది. మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన పోలీసులు, వాటితో వ్యాపారం చేస్తున్నారు. కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీలో కొందరు పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఏపీ కానిస్టేబుల్ గుణశేఖర్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ప్రోసిడింగ్స్ జారీ చేశారు తిరుపతి ఎస్పీ.

కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉండడం గమనించాడు. ఈ ఉద్యోగం ఎన్నాళ్లు చేసినా అంతేనని భావించాడు. డ్రగ్స్ వ్యాపారం కోసం అనేక మందిని కలిశాడు. దీనివల్ల సులువుగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. కొంతమందితో ముఠాను ఏర్పాటు చేశాడు. ఆరేళ్ల కిందట కానిస్టేబుల్ గుణశేఖర్‌తో సురేంద్రకు పరిచయం ఏర్పడింది.

కావలికి చెందిన వేణు అనే తన స్నేహితుడికి మెర్సీ మార్గరెట్ వద్ద లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించాడు సురేంద్ర. అయితే వేణు తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో సురేంద్రపై మెర్సీ ఒత్తిడి తెచ్చాడు. ఈ గండం నుంచి బయటపడేందుకు కానిస్టేబుల్ గుణశేఖర్‌ను సహాయం కోరాడు సురేంద్.

అప్పటికే డ్రగ్స్ వ్యాపారంలో బిజీగా ఉన్న గుణశేఖర్, తన వద్ద ఉన్న ఎపిడ్రిన్ డ్రగ్ విక్రయిస్తే కమిషన్ వస్తుందని చెప్పాడు. దానివల్ల అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని సలహా ఇచ్చాడు. అప్పుల సమస్య నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని భావించాడు, డ్రగ్స్ విక్రయించేందుకు అంగీకరించాడు. హరిబాబుతో కలిసి డ్రగ్స్ విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో బెంగళూరులో అప్పన్నకు ముందుగా 500 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను సురేంద్ర విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సరిగ్గా మూడు వారాల కిందట అప్పన్నకు మదనపల్లి వద్ద ఎపిడ్రిన్ డ్రగ్‌ను అందజేశాడు. మిగతా డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు నిందితులు స్కెచ్ వేశారు. మే చివరివారంలో ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా హైదరాబాద్‌కు వచ్చింది.

కూకట్‌పల్లి‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వీరంతా జూన్ ఒకటి (ఆదివారం) డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి సుమారు 820 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ గుణశేఖర్ కీలకంగా మారాడు. వీరిని విచారిస్తే డ్రగ్స్ సరఫరా చేసే ముఠా గుట్టు బయటకురావడం ఖాయమని అంటున్నారు.

పట్టుబడిన వారిలో తిరుపతి కానిస్టేబుల్ గుణశేఖర్, తిరుపతి రూరల్‌కు చెందిన సురేంద్ర, బాపట్లకు చెందిన హరిబాబు‌రెడ్డి, అద్దంకి మెర్సీ మార్గరెట్, షేక్ మస్తాన్ వలీ , దేవరాజు యేసుబాబు ఉన్నారు.  డ్రగ్స్ రాకెట్ వెనుక కానిస్టేబుల్ గుణశేఖర్ కీలకంగా మారాడు. ఆయన్ని విచారిస్తే ఇంకెంతమంది బయటపడతారో చూడాలి.