ఏపీతో ఎలాంటి వివాదాలు తాను కోరుకోవడం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఫ్లడ్ వాటర్ తరలిస్తే బాగుంటుందని సూచించారు. గోదావరి, కృష్ణా నీటిని తరలించాలనే నిర్ణయమే మేజర్ సమస్య అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటకతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో.. ఏపీతోనూ అలాంటి రిలేషనే కొనసాగుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ చచ్చిపోయింది..
మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రం విడిపోకముందు, విడిపోయిన తర్వాత కూడా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ఇన్నాళ్లూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని.. బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందని స్పష్టం చేశారు. జలాల పేరుతో ఇప్పుడు మళ్లీ పునరుజ్జీవనం కోసం ట్రై చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వటం వల్ల ఈ వివాదం మొదలైందన్నారు. తెలంగాణతో ముందే చర్చించి ఉంటే సమస్య ఇంత వరకూ వచ్చేది కాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం దగ్గరకు వెళ్లి మాట్లాడటం వల్ల.. కేసీఆర్కు విమర్శించే అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు.
అంతా కేసీఆరే చేశారు..
గోదావరి వరద జలాలను తరలించడానికి బీజం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు రేవంత్ రెడ్డి. అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ ఎందుకు ఆమోదం తెలిపారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆమోదం తెలిపాక చంద్రబాబు గోదావరి జలాలను తరలించారని.. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్ అబద్ధాలు మాట్లాడుతుందన్నారు రేవంత్. బీఆర్ఎస్ చెప్పిన అబద్ధాలు దేవుడు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు.
కిషన్రెడ్డికి ట్యూషన్ మాస్టార్ ఎవరంటే..
కిషన్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. తాను ఢిల్లీకి రాకముందే కిషన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిశారని చెప్పారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టార్ అయితే.. కేసీఆర్ లైజనింగ్ ఆఫీసర్ అని అన్నారు.