TELANGANA

హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మీరాలం చెరువుపై రూ. 430 కోట్ల వ్యయంతో ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఐకానిక్ కేబుల్ వంతెన బెంగళూరు జాతీయ రహదారి వద్ద శాస్త్రిపురం నుండి చింతల్‌మెట్ రోడ్‌ను కలుపుతుంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడ్‌లో నిర్మించనున్నారు.

 

⦿ అత్యద్భుతంగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి..

 

ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, హైదరాబాద్‌కు ఒక విశిష్ట గుర్తింపును తీసుకొస్తుందని భాగ్యనగర వాసులు భావిస్తున్నారు. ఈ వంతెన ఆధునిక డిజైన్‌తో, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పకడ్బందీతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వంటి ఇతర ఐకానిక్ నిర్మాణాలకు పోటీగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

⦿ అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర..

 

మీరాలం చెరువు, హైదరాబాద్‌లోని ముఖ్యమైన నీటి వనరులలో ఒకటి. దీని చుట్టూ అనేక అక్రమ నిర్మాణాలు గతంలో సమస్యగా మారాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ఈ అక్రమ నిర్మాణాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చెరువు పరిరక్షణకు భంగం కలిగించకుండా.. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ నిర్మించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే.. శాస్త్రిపురం, చింతల్‌మెట్ ప్రాంతాల మధ్య సమయం ఆదా అవుతుంది.

 

⦿ హైదరాబాద్‌కు మరింత విశిష్టత..

 

ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్డి నిర్మాణం పూర్తి అయిన తర్వాత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అదనంగా, ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ.. ఉపాధి అవకాశాలను కూడా కల్పించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చే దిశగా ఈ నిర్మాణం మరో అడుగు వేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

 

⦿ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం గురించి…

 

ఈ బ్రిడ్జి లెంగ్త్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. వెడెల్పు 16.5 మీటర్లతో నాలుగు రోడ్లు, చివరలకు కాలి బాట ఉంటుంది. మీరాలం చెరువుకు వెస్ట్ లో ఉన్న చింతల్ మెట్, ఈస్ట్ లో శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు నేషనల్ హైవేని కలుపుతూ నిర్మిస్తున్నారు. దీని వల్ల బహదూర్ పుర్, శాస్త్రిపురం, అత్తాపూర్, కిషన్ బాగ్, చింతల్ మెట్ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే చింతల్ మెట్ నుంచి బెంగళూరు నేషనల్ హైవే ద్వారా ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.

 

⦿ మీరాలం చెరువు చారిత్రక నేపథ్యం ఏంటి..?

 

మీరాలం చెరువు, హైదరాబాద్‌లోని ఒక చారిత్రక జలాశయం, మూడో నిజాం కాలంలో నిర్మించారు. ఈ చెరువు 1806లో మీర్ ఆలం బహదూర్ పేరుగా జలాశయాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన దివాన్ గా పనిచేశారు. ఈ చెరువును నీటిపారుదల, తాగునీటి సరఫరా కోసం ఉపయోగపడింది. నిజాం వంశస్థులు నిర్మించిన అనేక జలాశయాలలో ఇది ఒకటి. ఈ చెరువు మధ్యలో మూడు దీవులు ఉంటాయి. ఈ చెరువు చుట్టూ ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక నిర్మాణాలు దీనిని ఒక ప్రముఖ ఆకర్షణగా మార్చాయి. నేడు, ఇది స్థానికులకు విశ్రాంతి ప్రదేశంగా, పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది.