TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్..

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా? శుక్రవారం సిట్ ముందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారా? ఆయన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వారిని విచారించిన కేసుకు ముగింపు ఇవ్వాలన్నది సిట్ అధికారుల ఆలోచనగా చెబుతున్నారు.

 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నత్తనడకగా సాగుతోంది. ఈ కేసు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతోంది. ఈ కేసులో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయో తెలీదు. కాకపోతే సిట్ అధికారులు మాత్రం ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి మరీ సంబంధించిన వారిని విచారణకు పిలుస్తున్నారు.

 

అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుని సిట్ అధికారులు పలుమార్లు విచారించారు. ఆయన కీలక విషయాలు బయటపెట్టారు. ఆ సమాచారాన్ని గతంలో అరెస్టయిన అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత సిట్ ఒకొక్కరికి నోటీసులు ఇస్తోంది.

 

తాజాగా శుక్రవారం సిట్ అధికారుల విచారణకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారు. ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకులు మధు, ప్రవీణ్‌కుమార్, తిరుపతి కూడా విచారణకు రానున్నారు. ఆ తరహా కేసులో విచారణకు కేంద్రమంత్రి హాజరురావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారిని అంటున్నారు కొందరు అధికారులు.

 

కీలక నిందితుడు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ కీలకంగా మారినట్టు చెబుతున్నారు. బిగ్‌బాస్ చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశామని ఆయన చెప్పినట్టు అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఆనాడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ పదేపదే ట్యాప్ చేశామని తెలిపారట. ఈ క్రమంలో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగిపోయింది.

 

ఇదిలావుండగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వాంగ్మూలం ఇచ్చే క్రమంలో గురువారం కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన నివాసంలో హోంశాఖ అధికారులతో కేంద్రమంత్రి సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి హోంశాఖ అధికారులతోపాటు కౌంటర్ ఇంటెలిజెన్స్, తెలంగాణ, ఏపీ అధికారులు ఉన్నారు. నిఘా వర్గాలు సంజయ్‌కు రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ రిపోర్టును ఆయన సిట్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి అధికారులు ఎందుకు హాజరయ్యారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ వాంగ్మూలం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం విచారణకు పిలిచే అవకాశాలు సిట్ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతలు వెంటాడుతోంది.