ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి” అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి ఆలోచనను ఆయన గౌరవించారని తెలిపారు. హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఉందని అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే అజెండాతో ఎన్డీయే అభ్యర్థిని నిలబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపిందని చెప్పారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, కానీ తెలుగు వ్యక్తికి అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు.