TELANGANA

జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ అభ్యర్థి ఫిక్స్..!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరి మరింత రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది.

 

గత కొంతకాలంగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం చివరకు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి, సుమారు 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే ఆయనకు మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

 

ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బుధవారం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇతర ముఖ్య నేతల సమక్షంలో మాగంటి సునీత షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

 

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.