TELANGANA

హైదరాబాద్‌లో దారుణం: చట్నీ పడిందన్న కోపంతో వ్యక్తిని హత్య చేసిన నలుగురు యువకులు

హైదరాబాద్ శివారులోని ఉప్పల్, కల్యాణపురిలో నివసించే మురళీ కృష్ణ (45) అనే వ్యక్తిని కేవలం దుస్తులపై చట్నీ పడేశాడన్న చిన్న కారణంతో నలుగురు యువకులు దారుణంగా హత్య చేశారు. రాత్రి పనిమీద ఎల్బీనగర్ వెళ్లిన మురళీ కృష్ణ, ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఉప్పల్ వైపు వెళ్తున్న కారులోని యువకులను లిఫ్ట్ అడిగాడు. వారు అతడిని ఎక్కించుకున్నారు.

ఉప్పల్‌లోని ఒక టిఫిన్ సెంటర్‌ వద్ద అందరూ కలిసి ఇడ్లీ, బోండాలు తింటున్న సమయంలో, మురళీ కృష్ణ ప్లేట్‌లోని చట్నీ అనుకోకుండా కారులోని ఒక యువకుడి దుస్తులపై పడింది. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని మురళీ కృష్ణ చెప్పినప్పటికీ, ఆ నలుగురు యువకులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టడం మొదలుపెట్టారు. అనంతరం మురళీ కృష్ణను బలవంతంగా మళ్లీ కారులో ఎక్కించుకుని 2 గంటలపాటు అందులోనే తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు.

చివరికి, నాచారం సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. మురళీ కృష్ణ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 20 ఏళ్ల లోపు వారే, వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో మొహమ్మద్ జునైద్, షేక్ సైపుద్దీన్, పొన్నా మణికంఠ, మరియు ఒక 16 ఏళ్ల బాలుడు ఉన్నారు.