TELANGANA

నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ ద్వారా చేనేత కార్మికులకు అందాల్సిన యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది నేతన్నల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏటా సుమారు రూ. 105 కోట్ల విలువైన యూనిఫాంల ఆర్డర్‌ను విద్యాశాఖ కేటాయిస్తుందని కవిత గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 393 చేనేత సహకార సంఘాల ద్వారా వేలాది మంది కార్మికులు ఈ ఆర్డర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖ ఈ ఆర్డర్‌ను అకస్మాత్తుగా రద్దు చేయడం అంటే నేరుగా కార్మికుల పొట్ట కొట్టడమేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చేనేత సహకార సంఘాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

ప్రభుత్వ సంక్షేమ శాఖలు ఇతర డిపార్ట్‌మెంట్‌లకు అవసరమైన దుప్పట్లు దుస్తుల పంపిణీకి సంబంధించి దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఆర్డర్‌ను కూడా ఇప్పటి వరకు టెస్కో (TSCO) కు ఇవ్వలేదని కవిత ఆరోపించారు. గడువు ముగిసినప్పటికీ ఆర్డర్లు కేటాయించకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థ అయిన టెస్కోను నిర్వీర్యం చేసి తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు ఈ కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ అజెండా అని ధ్వజమెత్తారు.

 

చేనేత కార్మికులకు అన్యాయం చేసే ఈ అనాలోచిత చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రగతిని వెనక్కి నెడుతోందని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం వారి ఉపాధిని కాపాడటం కోసం తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకపోతే చేనేత కార్మికులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు.