ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యాన్ని వీడి, ఆదిలాబాద్ను పారిశ్రామిక, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
గత పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి, అంచనాలు పెంచి వేల కోట్లు వృధా చేశారని, కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం విమర్శించారు. ఆదిలాబాద్ దాహార్తిని తీర్చేందుకు తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నారని, త్వరలోనే కుప్పి వద్ద పనులు ప్రారంభించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మాట ఇచ్చారు.
జిల్లా ప్రజల చిరకాల కోరికైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. జూన్ 2వ తేదీలోగా ఎయిర్పోర్ట్ పనులకు శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. దీనితో పాటు, ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, భూసేకరణ ప్రక్రియ ముగియగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ. 225 కోట్లు ప్రాథమికంగా మంజూరు చేశామని, భక్తుల కోసం మౌలిక వసతులు పెంచుతామని చెప్పారు. ప్రేమసాగర్ రావు విజ్ఞప్తి మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని గోదావరి పుష్కరాల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతూ, త్వరలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని సీఎం ప్రకటించారు. గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇచ్చామని, ఈసారి చిలకపచ్చ రంగు చీరలను ఆడబిడ్డలకు సారెగా అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం డిసెంబర్లోగా నిధులు విడుదల చేస్తామని, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 53.50 కోట్ల చెక్కును అందజేశారు.
డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాల బారిన పడకుండా యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఆదిలాబాద్లో క్రీడా పాఠశాల, మైదానాల అభివృద్ధికి ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆదేశాలిచ్చారు. ఇటీవల సీఎం కప్ రెండో ఎడిషన్లో 32 పతకాలు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ క్రీడాకారులకు ట్రోఫీని అందజేసి అభినందించారు.
ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలే అయిందని, పదేళ్లు పాలించిన వారు ఇప్పటికీ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. తాము పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగినా పనులు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. మళ్ళీ గడీల పాలన రానివ్వబోమని, 2034 వరకు తమ ప్రజాపాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2న మళ్ళీ వచ్చి మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

