World

పుంగ్-వాంగ్ సూపర్ టైఫూన్ బీభత్సం: ఫిలిప్పీన్స్‌లో 230 కి.మీ వేగంతో గాలులు, 10 లక్షల మంది తరలింపు

ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్-వాంగ్’ అనే సూపర్ టైఫూన్ వణికిస్తోంది. ఈ అతి తీవ్ర తుపాను కారణంగా గంటకు గరిష్ఠంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. తుపాను దాటికి మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పొంచి ఉండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్‌లో ఈ భయంకరమైన తుపాను తీరాన్ని తాకింది. ఈ తుపాను తీవ్రత సుమారు 18 వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తుపాను తీవ్రత దృష్ట్యా, అధికారులు ఇప్పటికే సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుపాను ధాటికి కటండువానెస్ ప్రావిన్సులో మెరుపు వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా బికోల్, తూర్పు విసాయాస్‌లను వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా, తీర ప్రాంతాల్లో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి, వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, అనేక చోట్ల చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. ఉత్తర ప్రావిన్సుల్లోని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించారు.

పసిఫిక్ మహాసముద్ర ఉష్ణమండల వాతావరణ వ్యవస్థలు ఏర్పడే ప్రాంతానికి సమీపంలో ఉన్నందున, ఫిలిప్పీన్స్ తుఫానులకు ప్రపంచంలోనే అత్యంత హాని కలిగించే దేశాలలో ఒకటి. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ను తాకిన 21వ తుపాను ఇది. ఇటీవలే స్థానికంగా కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించగా, దాదాపు 224 మంది మరణించిన విషయాన్ని ఈ వార్త గుర్తుచేసింది.