పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది. పహల్గాం సమీపంలోని బైసరణ్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే పాకిస్థాన్కు అత్యంత శక్తిమంతమైన హెచ్చరికలు జారీ చేశారు.
“భారత్ తనంతట తానుగా ఎవరిపైనా దాడి చేయదు. కానీ మా పొరుగున ఒకే ఒక దేశం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంది. ఆ దేశం భారత్ను ప్రమాదంలో పడేయాలని చూస్తే… మన ప్రతిస్పందన ‘డాట్, డాట్, డాట్’ స్థాయిలో ఉంటుంది” అంటూ పాక్ పేరు ఎత్తకుండానే రాజ్నాథ్ గట్టిగా హెచ్చరించారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా గతేడాది మే నెలలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోని 9 ఉగ్రవాద శిబిరాలను, 11 వైమానిక స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు మన సైనిక శక్తి మరింత పెరిగిందని స్పష్టం చేశారు.
ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘కోల్కతాపై దాడి చేస్తాం’ అంటూ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా రాజ్నాథ్ స్పందిస్తూ, భారత్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని పరోక్షంగా సమాధానమిచ్చారు.

