AP

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..! రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్..

గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. ప్రతిఘటించిన దుండుగులు, కాల్పుల ప్రారంభించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగింది?

 

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..

 

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రేల్వే గేట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ రైల్వే పోలీసులకు కనిపించారు. వెంటనే అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు, అనుమానితులు ఉన్న ప్రదేశానికి చేరుకునే ప్రయత్నం చేశారు.

 

పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దాదాపు 10 రౌండ్లపాటు రైల్వే పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్, పోలీసుల కాల్పులతో దుండగులు పరారీ

 

దుండగుల రాళ్లు రువ్వడంతో పోలీసులు షాకయ్యారు. దుండగులు రాళ్లు రువ్వే స్థాయికి వచ్చారంటే ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పులతో భయపడిన దుండగులు, అక్కడి నుంచి పరారైపోయారు. దుండగలు ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్నారు.

 

వారి కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. పోలీసులు సకాలంగా రాకుంటే ఏదో జరిగేదని అంటున్నారు. రైళ్లలో దోపిడీల నియంత్రణ కోసం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. రైల్వే సిగ్నల్ వ్యవస్థ వద్ద దుండగులు ఎందుకున్నారు? వారెవరు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.