దేశంలో కులగణన (Caste Census) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇటువంటి పరిపాలనాపరమైన వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. సమాజంలో వెనుకబడిన జనాభా వివరాలు, వారి సామాజిక స్థితిగతులు కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, వాటి సమర్థవంతమైన అమలుకైనా కులగణన అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది నేటి పరిస్థితుల్లో తప్పనిసరి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుకు ఎంతమంది వెనుకబడిన కులాల వారున్నారో తెలుసుకోవాలని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది.

