TELANGANA

మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి అమరవీరులను అవమానించేలా ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

 

తెలంగాణ మీ అయ్య జాగీరా?

 

తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ తన మనసులోని ద్వేషాన్ని, వివక్షను బయటపెట్టుకున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్ వాడిన భాష చూస్తుంటే రక్తం మరుగుతోందని, కోట్లాది మంది ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రం కోసం తాము మంత్రి పదవులను త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన చరిత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 

పొలిటికల్ కుట్రలు.. ఆంధ్రా కాంట్రాక్టర్లపై నిషేధం

 

టీడీపీ, బీజేపీలతో కలిసి పవన్ కళ్యాణ్ తెలంగాణపై మళ్లీ కుట్రలు చేస్తున్నారనే అనుమానాన్ని మంత్రి వ్యక్తంచేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ, తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. అంతేకాకుండా, ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కూడా వెనకాడబోమని సంచలన ప్రకటన చేశారు.

 

ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

 

ఆరుసార్లు చట్టసభలకు ఎన్నికైన సీనియర్ రాజకీయ నాయకుడిగా పవన్‌కు ఒక ఉచిత సలహా ఇస్తున్నట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తెలంగాణపై పగ ప్రదర్శించడం మాని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండు ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప, ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రేపడం సరికాదన్నారు. మా సహనాన్ని పరీక్షించొద్దని, తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామని ‘తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.