TELANGANA

వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్..

పెద్దపల్లిలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల గార్డెన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు.

 

రేవంత్ పాలనపై ఘాటు విమర్శలు

 

రేవంత్ రెడ్డి ఎన్ని తలకిందుల తపస్సులు చేసినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన స్కాలర్‌షిప్‌లు, రైతుబంధు వంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన హిట్లర్ రాజ్యాంగాన్ని తలపిస్తోందని, సామాన్యుల ఇళ్లను కూలదోస్తూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కేసీఆర్ రైతు పక్షపాతి.. కాంగ్రెస్ రైతు విరోధి

 

కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ఓట్ల కోసం కాకుండా, రైతులపై ప్రేమతో తెచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. 11 విడతల్లో రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని, గత నాలుగు నెలలుగా రైతుబీమా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ‘రైతు డిస్కం’ పేరుతో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను కట్ చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని, ఇదే జరిగితే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు.

 

కార్యకర్తలకు అండగా ఉంటాం

 

ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, రాబోయేది తమ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను బిఆర్ఎస్ హైకమాండ్ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.