భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఆన్లైన్లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ పర్యటనను, ప్రవాస భారతీయులతో జరగనున్న భారీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు వెలువడింది.
వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ ప్రచారంలో భాగంగా ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ కింద ‘అబు ముస్తఫా’ అనే ఖాతా నుంచి బెదిరింపు కామెంట్ వచ్చింది. “ఈవెంట్ సమయంలో స్టేడియం పైకప్పులు మూసి ఉంచడం మంచిది. లేదంటే, ఆయన తన చావు కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు అవుతుంది” అని ఆ కామెంట్లో పేర్కొన్నారు.
ఈ విషయం జూలై 3న ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు, బెదిరింపు పోస్ట్ చేసిన ఖాతాకు సంబంధించిన ఐపీ అడ్రస్ను గుర్తించినట్లు సమాచారం. అయితే, దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ విషయంపై పూర్తి వివరాలు వెల్లడించడానికి ఏఎఫ్పీ నిరాకరించింది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేసినట్లు ప్రకటించలేదు.
ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నాయకత్వ సదస్సు కోసం ప్రధాని మోదీ జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ఆస్ట్రేలియా భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.

